కనిగిరి: గాయం వారి పల్లిలో మూడు నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఉపాధి కూలీల ధర్నా
హనుమంతునిపాడు మండలం గాయం వారి పల్లి లో ఉపాధి కూలీలు శుక్రవారం ధర్నా చేపట్టారు. గడిచిన మూడు మాసాలుగా ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మూడు నెలలుగా ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని, కూలీలు ఏం తిని బ్రతకాలని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉపాధి కూలీకి రోజువారి కూలీ రూ.600లు ఇవ్వాలన్నారు.