ఉరవకొండ: శ్రీరంగాపురం చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి విద్యార్థి మృతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామంలో గురువారం గ్రామ సమీపంలోనే ఉన్న చెరువులోకి సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లి ఈతకు దిగిన ప్రణయ్(08) నీట మునిగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మరాజు గంగమ్మల కుమారుడైన ప్రణయ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల రెండవ తరగతి పూర్తి చేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి చెరువులోకి వెళ్లి ఈతకు దిగి నీట మునిగాడు. స్థానికులు గమనించి గాలింపు చేపట్టి ప్రణయ్ ను బయటికి తీశారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందిడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.