రాయదుర్గం: పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు : తహసీల్దార్ హరికుమార్
రాయదుర్గం పట్టణంలో పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని తహసీల్దార్ హరికుమార్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని లక్ష్మీబజార్, శాంతినగర్ వద్ద ఉన్న ఐఓసి, హెపి పెట్రోలు పంపులను సిఐ జయనాయక్ తో కలసి తనిఖీ చేశారు. పెట్రోలు, డీజిల్ స్టాక్ ఎంతమేరకు ఉందో ఇన్ టేక్ ట్యాంక్ లు పరిశీలించారు. స్టాక్ రికార్డులు తనిఖీ చేశారు. వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని అవగాహన కల్పించారు. మరో రెండు మూడు రోజులకు అవసరమైన మేరకు డీజిల్, పెట్రోలు నిల్వలు ఉన్నాయన్నారు. పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.