ఆత్మకూరు పట్టణంలో మంటల ఆర్పి గుర్రాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు
నంద్యాల జిల్లా ఆత్మకూరులో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు. అయితే, గాలి ఉధృతికి ఆ మంటలు క్షణాల్లో భారీగా విస్తరించాయి. సరిగ్గా అదే సమయంలో మంటల సమీపంలోనే ఒక గుర్రపు బండి కట్టేసి ఉంది. మంటలు వేగంగా గుర్రం వైపు దూసుకురావడంతో ఆ మూగజీవి విలవిల్లాడిపోయింది. సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చిరంజీవి, హోంగార్డ్ చక్రపాణి అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంటల్లోకి వెళ్లి.. చాకచక్యంగా గుర్రాన్ని విడిపించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.