కర్నూలు నగరపాలక అధికారులు, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు కార్యాలయాల్లో కూర్చుని కాదు, క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడే స్పష్టంగా అర్థమవుతాయని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు జొహరపురం ప్రాంతంలో ఆయన వివిధ కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు.