బొడ్డుమానుపాకలు గ్రామంలో వరి, రాజ్ మా, పసుపు పంటలను పరిశీలించిన గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు
గూడెం కొత్తవీధి మండలంలోని బొడ్డుమానుపాకలు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డీ.వెంకటేష్ బాబు పర్యటించారు. ముందుగా వ్యవసాయ రైతు సదస్సు నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి వరి, రాజ్ మా, పసుపు పంటలను పరిశీలించారు. రాజ్ మా 2వారాల వయసు ఉందన్నారు. రాజ్ మా పంటకు రసం పీల్చే పురుగు ఆశించకుండా, ఎకరానికి ఒక లీటరు వేప నూనె పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. వరి పంటలో పొటాష్ లోపం కనిపిస్తుందన్నారు. పొటాష్ లోపానికి ఎకరానికి 15-20 కేజీల ఎంవోపీ వేసుకోవాలని సూచించారు.