అర్ధరాత్రి నీటి సరఫరాతో ప్రజలకు ఇబ్బందులు : ప్రజా పోరుబాటలో సిపిఎం డిమాండ్
Ongole Urban, Prakasam | Apr 8, 2026
నగర ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పోరుబాట కార్యక్రమం రెండో రోజు బుధవారం 50, 49, 48 డివిజన్లలో విస్తృతంగా కొనసాగింది. వెంకటేశ్వర కాలనీ, జయప్రకాశ్ కాలనీ, చైతన్య కాలనీ, సత్యనారాయణపురం, కరవదివారివీధి, 60 అడుగుల రోడ్డు, బాలకృష్ణాపురం తదితర ప్రాంతాల్లో నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.వెంకటేశ్వర కాలనీలో ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 12 గంటల తర్వాత మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు.