హైదరాబాద్ పురానాపూల్లోని పురానాపూల్ దర్వాజా వద్ద ఉన్న శ్రీ మైసమ్మ ఆలయంలో జరిగిన ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం స్పందించారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో ఓ ఆగంతకుడు ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహంతో పాటు చిత్రపటాలను చెల్లాచెదురుగా పడేసిన ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఆలయ నిర్వాహకులు, స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దేవాలయాల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.