అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలంలోని విరుపాపురం గ్రామంలో చింత చెట్టు పై నుంచి పడి శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన శ్రీనివాసులు రైతుల నుంచి చింత కాయలను కొనుగోలు చేసి విక్రయించుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో విరుపాపురం గ్రామంలో మంగళవారం చింత చెట్టు ఎక్కి చింత కాయలను కోస్తుండగా చెట్టుపై నుంచి జారి కింద పడ్డాడు. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును చికిత్స నిమిత్తం ఆటోలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.