పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై సమీక్షించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు డిఇఓ సి.వి. రేణుక ఈ సందర్భంగా వివరించారు.