నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాం నగర్ కాలనీలో ఓ పెయింటర్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన నాందేవ్ (45) ఆ ఇంటికి పెయింటింగ్ వేయడానికి వచ్చాడు. అయితే ఇంటిపైన విద్యుత్ తీగలు ఉన్నాయి. నాందేవ్ ప్రమాదవశాత్తు వాటికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై గంగాధర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.