ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. కారుణ్య నియామక కోటాలో ఉద్యోగం పొందిన 13 మందికి శనివారం ఆమె నియామక పత్రాలను ఇచ్చారు. ఆడిట్, రెవెన్యూ, పరిశ్రమలు, రిజిస్ట్రేషన్, కార్మిక శాఖలలో వీరికి ఉద్యోగాలు కల్పించారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానానికి చేరుకునేలా పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.