ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ దుష్ట పన్నాగానికి పాల్పడుతోందని ఆరోపించారు. చట్టాన్ని అతిక్రమిస్తూ, ఉద్దేశపూర్వకంగా తప్పుడు లీకులు ఇచ్చి బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిజాలు బయటకు రావాల్సిన సమయం వచ్చిందని, ఈ వ్యవహారంపై న్యాయపరంగా పోరాడతామన్నారు.